భీకర దాడులు చేస్తాం:ఇరాన్
ఇరాన్పై మరోసారి యుద్ధానికి దిగితే గతంలో ఉపయోగించిన వాటికంటే మరింత ఆధునిక, శక్తివంతమైన ఆయుధాలతో ఎదుర్కొంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హెచ్చరించింది.
IRGC ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హొస్సేన్ మొహెబ్బీ మాట్లాడుతూ.. ఇరాన్ నిరంతరం తన సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. క్షిపణుల ఖచ్చితత్వం, విధ్వంసక సామర్థ్యం, పరిధి, సాంకేతికత వంటి అంశాల్లో మరింత పురోగతి సాధిస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తులో యుద్ధం జరిగితే ఇరాన్ ఉపయోగించే ఆయుధాలు గతంలో ఉన్న వాటిలా ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాల వార్హెడ్లు, దాడుల ఖచ్చితత్వం, క్షిపణుల పరిధి తదితర అంశాల్లో గణనీయమైన మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇరాన్ ఆయుధ సామర్థ్యాల అభివృద్ధిని ఎప్పుడూ నిలిపివేయలేదని, భవిష్యత్తులో మరింత ఆధునిక సామర్థ్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని మొహెబ్బీ తెలిపారు.
ఇదే సందర్భంగా యెమెన్కు చెందిన అన్సారుల్లా ఉద్యమం, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. సౌదీ అరేబియా యెమెన్కి చెందిన ఈ శక్తిని సులభంగా అణచివేయలేదని ఆయన అన్నారు.
గాజాలో ఇజ్రాయెల్కు రెండేళ్లకు పైగా జరిగిన యుద్ధంలో కూడా హమాస్ను పూర్తిగా బలహీనపరచలేకపోయిందని ఆయన పేర్కొంటూ.. ఇజ్రాయెల్ కంటే తక్కువ సైనిక సామర్థ్యం ఉన్న సౌదీ అరేబియా యెమెన్ ప్రతిఘటనను ఓడిస్తుందని భావించడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
